: భూమ్మీదే అత్యంత భద్రత కలిగిన సూట్‌లో భారత ప్రధాని మోదీ.. ఇంకా బోలెడన్ని విశేషాలు!

ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న మోదీ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన.. ఇంకా చెప్పాలంటే ఈ భూమ్మీదే అత్యంత భద్రత కలిగిన సూట్‌ లో బస చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని ఆయన బస చేసిన కింగ్ డేవిడ్ హోటల్‌ను బాంబు దాడులు, రసాయన దాడులు కూడా ఏమీ చేయలేవని ఆ హోటల్ ఆపరేషన్స్ డైరెక్టర్ షెల్డన్ రిట్జ్ తెలిపారు. బాంబులు దానిని తాకను కూడా లేవని వివరించారు. మోదీ, ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధుల కోసం హోటల్‌లోని 110 రూములు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ శతాబ్దంలోని అమెరికా అధ్యక్షులందరికీ ఈ హోటల్ ఆతిథ్యమిచ్చిందని తెలిపారు. క్లింటన్, బుష్, ఒబామా, మూడు వారాల క్రితం ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇందులో బస చేసినట్టు చెప్పారు. ఇప్పుడు మోదీకి ఆతిథ్యం ఇచ్చినట్టు తెలిపారు.

అంతేకాదు మోదీ బస చేసిన సూట్‌లో ప్రత్యేకంగా వంటగది కూడా ఉంది. చివరి నిమిషంలో ఏదైనా కావాలనుకుంటే అక్కడే తయారుచేసి ఇస్తారు. మోదీ గుజరాతీ వంటకాలను మాత్రమే తింటారని తాను భావిస్తున్నట్టు రిట్జ్ పేర్కొన్నారు. ఆయన కోసం తప్పనిసరిగా సిద్ధం చేయాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించిన జాబితా తమకు అందిందన్నారు. మోదీ వస్తున్నారని తెలిసి గత కొన్ని రోజులుగా హోటల్ సుగంధాల సువాసనను సంతరించుకుందని వివరించారు.

More Telugu News