: హైదరాబాదు నగరం ముసుగుతన్ని పడుకున్న వేళ... కదంతొక్కిన తెలంగాణ 'ఆక్టోపస్' పోలీసులు!

భాగ్యనగరం ముసుగుతన్ని పడుకున్న వేళ తెలంగాణ 'ఆక్టోపస్' పోలీస్ దళాలు 'హ్యాపీ హోంస్' అపార్ట్ మెంట్స్ లో కదంతొక్కాయి. సుమారు 500 ప్లాట్లు ఉన్న ఈ గృహ సముదాయంలో, మైలార్ దేవ్ పల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి యత్నించినవారు కారు పార్క్ చేసినట్టు సీసీ కెమెరా విజువల్స్ లో బయటపడింది. దీంతో హ్యపీ హోమ్స్‌ వద్ద దుండగుల కారు గురించిన సమాచారం సెక్యూరిటీ గార్డు పోలీసులకు అందించాడు. అది గుజరాత్ రిజిస్ట్రేషన్ తో ఉందని, నెంబర్ ప్లేట్ పగులగొట్టి ఉందని సమాచారం ఇచ్చాడు. అంతే కాకుండా, కారులో మారణాయుధాలు కూడా ఉన్నట్టు చెప్పాడు. దీంతో సీసీ కెమెరాను మరింత క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలతో రంగంలోకి దిగారు.

రాత్రివేళ హ్యాపీ హోమ్స్‌ ను చుట్టుముట్టారు. ఇళ్లల్లోని వారిని ఖాళీ చేయిస్తూ జల్లెడపట్టారు. హ్యాపీ హోమ్స్ లో ఉన్న 9 బ్లాకుల్లో దాదాపు 500 ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్ మెంట్లన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపేసి అంగుళం అంగుళం తనిఖీలు చేశారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసిన పోలీసులకు అవి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 వరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనంలో వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతుండగా, పోలీసులు మాత్రం తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటించారు.

More Telugu News