: నా పేరిట ఇన్ని హోర్డింగులా? మరెక్కడా ఇంత స్వాగతం లభించలేదన్న రామ్ నాథ్

హైదరాబాద్ లో తనకు లభించిన ఘనస్వాగతాన్ని చూసి ముచ్చటపడ్డ ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్, సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నేతలతో జలవిహార్ లో సమావేశమైన కోవింద్, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తాను ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుంచి ఎన్నో భారీ హోర్డింగులు తనకు స్వాగతం పలుకుతూ కనిపించాయని, ఇంత ఘనస్వాగతం తనకు మరెక్కడా కనిపించ లేదని తెలిపారు. ఇంత భారీ ఏర్పాట్లు చేసిన కేసీఆర్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

 ఇంకో విషయానికి కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వుందని, తాను యూపీకి చెందిన వ్యక్తినైనందున తనకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ హిందీలో ప్రసంగించారని చెప్పారు. పూర్వపు రాష్ట్రపతులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, అబ్దుల్ కలామ్ లు చూపిన దారిలో తాను నడుస్తానని అన్నారు. ముఖ్యంగా ఇక్కడి వారైన జాకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డిలు కూడా తనకు ఆదర్శమేనని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత తనపై పెట్టాలని భావించిన ఎన్డీయేకు, తనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు.

More Telugu News