: డ్రగ్స్ కు అలవాటు పడ్డ విద్యార్థుల పేర్లను వెల్లడించే సమస్యే లేదు: స్పష్టం చేసిన అకున్ సబర్వాల్

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో 1200 మందికి పైగా విద్యార్థుల పేర్లు ఉన్నాయని తెలిపారు. వీరంతా 200కు పైగా వాట్స్ యాప్, టెలిగ్రాం యాప్ లను నిర్వహిస్తూ, మాట్లాడుకుంటున్నట్టు గుర్తించామన్నారు. విద్యార్థుల పేర్లను బయటపెట్టాలన్న ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదని తెలిపారు.

 వారి భవిష్యత్తు దృష్ట్యా, కనీసం విచారణకు కూడా పిలువబోమని, వారికి సంబంధించిన సమాచారాన్ని సదరు పాఠశాలల ప్రిన్సిపాల్స్ కు మాత్రమే పంపామని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయించే ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని, ఇంకా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి వివరాలు విద్యార్థుల వద్ద ఉంటే వారు తమకు సమాచారాన్ని అందిస్తే, గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

More Telugu News