: 'కోవిందా... కోవిందా' నామస్మరణలో టీఆర్ఎస్, టీడీపీ!

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి పదవికి బరిలోకి దిగిన రామ్ నాథ్ కోవింద్ నేడు తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానుండగా, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇప్పటికే అన్ని రహదార్లపై కోవింద్ కు స్వాగతం పలుకుతూ, భారీ హోర్డింగ్ లు వెలిశాయి. ముఖ్యంగా ఆయన విమానం దిగే బేగంపేట నుంచి ఖైరతాబాద్, అసెంబ్లీ, బంజారాహిల్స్ వైపు దారితీసే రహదారుల్లో భారీ వినైల్ పోస్టర్లను ఉంచారు. అందుబాటులో ఉన్న అందరు మంత్రులూ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలకాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో పాటు హైదరాబాద్ నగర మేయర్, ఇతర ప్రొటోకాల్ అధికారులు ఆయనకు వెల్ కం చెప్పనున్నారు.

ఇక హైదరాబాద్ లో ఉదయం 9:40కి ల్యాండ్ అయ్యే రామ్ నాథ్, ఉదయం 10 గంటలకు బీజేపీ నేతలతో, 11 గంటలకు జగన్ సహా వైకాపా నాయకులతో, 12 గంటలకు కేసీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులతో సమావేశం కానున్నారు. ఆయనకు మధ్యాహ్న భోజన విందును కేసీఆర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆ తరువాత విజయవాడకు రామ్ నాథ్ బయలుదేరుతారు. అక్కడ చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను కలుసుకుని తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆపై తేనీటి విందును స్వీకరించిన తరువాత తిరిగి బయలుదేరుతారు.

More Telugu News