: భారత్ కు చైనా మళ్లీ వార్నింగ్... చైనా కూడా అప్పటిది కాదని హెచ్చరిక!

భారత్, చైనాల మధ్య ఘర్షణ వాతావరణం అంతకంతకు వేడెక్కుతోంది. సిక్కిం సరిహద్దు వివాదంపై రెండు దేశాలు మాటల తూటాలు వదులుతున్నాయి. భారత్ చరిత్ర మర్చిపోయిందని చెబుతూ, గతంలో జరిగిన యుద్ధాల్లో భారత్ ఓటమిపాలవడాన్ని చైనా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ 'భారత్ అప్పటిది కాద'ని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ భారత్ ను తీవ్రంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు.

ఈ మేరకు ఆయన చైనాలో మాట్లాడుతూ, 'నిజమే.. 1962 నాటి పరిస్థితులతో పోలిస్తే 2017 నాటి భారత్‌ కు తేడా ఉంది. అదే సమయంలో చైనా కూడా అంతే' అంటూ ఆయన స్పష్టం చేశారు. సిక్కిం సరిహద్దు వివాదంపై మాట్లాడుతూ 1890 నాటి ఒప్పందానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో భారత్‌ తమ భూభాగాన్ని వదిలి వెనక్కి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎంత వ‌ర‌కైనా వెళ్లడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. డోక్లాం ప్రాంతంలో ప్రవేశించేందుకు భూటాన్‌ ను భారత్‌ పావుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

More Telugu News