: ప్రధాని మోదీ బాల్యంలో టీ అమ్మిన రైల్వే స్టేషన్ ఇకపై పర్యాటక ప్రదేశం!

ప్రధాని నరేంద్ర మోదీ బాల్యంలో టీ అమ్మిన గుజరాత్‌లోని వాద్‌నగర్ రైల్వే ప్లాట్‌ఫాం ఇకపై పర్యాటక ప్రదేశంగా మారిపోనుంది. ప్లాట్‌ఫాంపై ఉన్న టీ స్టాల్‌ను పునరుద్ధరించి పర్యాటక ప్రదేశంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ టీ స్టాల్‌ను టూరిస్ట్ కేంద్రంగా మార్చనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖామంత్రి మహేశ్ శర్మ తెలిపారు. తద్వారా ఆ ప్రాంతానికి ప్రపంచ పర్యాటక పటంలో గుర్తింపు వస్తుందన్నారు. అక్కడి పాతకాలం నాటి టీస్టాల్‌కు కొన్ని ఆధునిక హంగులు అద్దనున్నట్టు తెలిపారు. దీనిని పక్కన పెడితే వాద్‌నగర్‌కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఎంతో ఖ్యాతి గాంచిన శర్మిష్ట సరస్సు ఇక్కడే ఉందన్నారు. అంతేకాదు, ఇటీవల ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బౌద్ధ మతానికి సంబంధించిన పలు ఆనవాళ్లు బయటపడినట్టు మంత్రి తెలిపారు.

More Telugu News