: రూ. 699కి స్పైస్ జెట్, రూ. 745కు ఇండిగో... ఆఫర్ల వెల్లువ!

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు మాన్ సూన్ ఆఫర్లను ప్రకటించాయి. లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సేవలందిస్తున్న స్పైస్ జెట్ సంస్థ రూ. 699కి, మరో బడ్జెట్‌ ఫ్లయిట్ ఎయిర్‌ లైన్స్‌ ఇండిగో రూ. 745కు ఒకవైపు ప్రయాణ టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించాయి.

వీటిలో స్పైస్ జెట్ ఆఫర్ విషయానికి వస్తే, 'మెగా మాన్ సూన్ సేల్' పేరిట జూలై 4లోగా కొనుగోలు చేసి, ఆపై 14 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 24 లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాలని పేర్కొంది. సంస్థ వెబ్ సైట్, మొబైల్ యాప్, ఎయిర్ పోర్టు కార్యాలయాలు, ఆన్ లైన్ పోర్టల్స్, ట్రావెల్ ఏజంట్ల నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

ఇక ఇండిగో కూడా ఇదే తరహా పథకాన్ని ప్రకటించింది. జూలై 4 లోపు డిస్కౌంట్‌ ధరల్లో టికెట్లను బుక్ చేసుకుని, 14వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 24 మధ్య ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని పేర్కొంది.

ఇదిలా ఉంచితే, ప్రతి ఏడాది మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య అధికంగా వుంటుంది. ఈ ఏడాది కూడా ఈ మే నెలలో విమానాల ద్వారా ఎక్కువగానే ప్రయాణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారత విమానయాన సంస్థలు ఈ మే నెలలో 1.01 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గత సంవత్సరం మే నెలలో 86.69 లక్షల మంది ప్రయాణించారు. అంటే, ఈ సంవత్సరం ఈ మే నెలలో ప్రయాణికుల సంఖ్యలో 17.36 శాతం వృద్ధి నమోదైంది.  

More Telugu News