: బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఆలస్యంగా వచ్చాడని వివాహాన్ని రద్దు చేసుకున్న యువతి

ఒకప్పుడు కట్నకానుకల విషయంలో విభేదాలు వచ్చి పెళ్లికొడుకులు వివాహాలను ఆపేసి వెళ్లిపోయేవారు. వివాహం ఆగిపోయిందంటూ వధువు తరపువారు పంచాయతీ పెట్టేవారు. అయితే కాలం మారింది. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.... యూపీలోని ఫిరోజాబాద్‌ లోని భీం నగర్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (40)కి అదే ప్రాంతానికి చెందిన యువతితో రెండో పెళ్లి నిశ్చయమైంది. రెండు కుటుంబాలు ముందే అన్ని విషయాలు మాట్లాడుకున్నాయి.

అయితే వివాహానికి కొన్ని గంటల ముందు వరుడు బ్యూటీ పార్లర్‌ కి వెళ్లాడు. అక్కడి నుంచి మండపానికి రావడం ఆలస్యం కావడంతో వధువు వివాహాన్ని ఆపేసింది. దీంతో అవాక్కైన పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో పాటు స్థానిక పంచాయితీ పెద్దల్ని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. అయితే, యువతి ఆ వివాహం తనకు ఇష్టం లేదని చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వరుడు తనకంటే పెద్దవాడని, అతనిని వివాహం చేసుకోవడం ఇష్టంలేదని తేల్చిచెప్పింది. దీంతో వివాహం రద్దైంది. కాగా, రెండు రోజుల క్రితం మరో సంఘటనలో పెళ్లి కొడుకు స్నేక్‌ డ్యాన్స్‌ చేస్తున్నాడన్న కారణంగా వధువు పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 

More Telugu News