: ఖుషీపై వచ్చిన వార్తలన్నీ అబద్ధం: స్పష్టం చేసిన శ్రీదేవి

రెమో డిసౌజా నిర్వహిస్తున్న పాప్యులర్ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొనాలన్న కోరికతో తన కుమార్తె ఖుషీ ఆడిషన్స్ కు వెళ్లిందని, ఫైనల్ వరకూ చేరలేకపోయిందని వచ్చిన వార్తలపై శ్రీదేవి స్పందించింది. "ఈ వార్త విని నేను ఆశ్చర్యానికి గురయ్యాను. కుషి ఎటువంటి డ్యాన్స్ క్లాస్ లేదా షోల్లో పాల్గొనడం లేదు. ఎక్కడి నుంచీ ఈ పుకారు వచ్చిందో" అని శ్రీదేవి వ్యాఖ్యానించింది. టీవీ రియాల్టీ షో 'డ్యాన్స్' థర్డ్ సీజన్ కోసం ఖుషీ ఆడిషన్స్ కు వెళ్లి, టాప్-35 వరకూ చేరుకుందని, అంతకు మించి ముందడుగు వేయలేకపోయిందని, ఆ తరువాతే అంతవరకూ తమ ముందు డ్యాన్స్ చేసిన అమ్మాయి ఖుషీ అని షో నిర్వాహకులకు తెలిసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రూమర్ ను చూసి నవ్వుకున్నామని, ఈ వార్త ఎలా వచ్చిందని తన కుమార్తె తనను అడిగిందని, మామ్ ప్రమోషన్ నిమిత్తం పాల్గొన్న ఓ కార్యక్రమంలో శ్రీదేవి చెప్పుకొచ్చింది. తన పెద్ద కుమార్తె జాన్వీ తెరంగేట్రంపై స్పందిస్తూ, సమయం వచ్చినప్పుడు ఆ విషయం అందరికీ తెలుస్తుందని పేర్కొంది.

More Telugu News