: తొమ్మిదేళ్ల క్రితం గ్యాంగ్ రేప్ చేసి నేటికి కూడా వదలట్లేదు... బాధితురాలిపై నాలుగోసారి యాసిడ్ పోసిన దుండగులు

అత్యాచారానికి గురై, ఆపై మూడుసార్లు యాసిడ్ దాడికి గురైన ఆమె మరోసారి బాధితురాలైంది. ఎంతో మానసిక ధైర్యంతో జీవితాన్ని గడుపుతున్న యువతిపై దుండగులు నాలుగోసారి యాసిడ్ దాడికి దిగారు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, లక్నోలోని తన హాస్టల్ నుంచి మంచినీటి కోసం బయటకు వచ్చిన ఆమెపై రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి పరారయ్యారు. ఆమెపై గతంలో మూడు సార్లు ఇదే తరహా దాడి జరగడంతో, హాస్టల్ వద్ద ఆయుధాలతో కూడిన సెక్యూరిటీని నియమించినా, మరో దాడి జరగడాన్ని పోలీసులు సీరియస్ గా భావిస్తున్నారు.

ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ వర్శిటీలో యాసిడ్ గాయాలకు ఆమె చికిత్స పొందుతోంది. ముఖంపై కుడివైపున యాసిడ్ పడిందని, నిందితులను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్నో అదనపు డీజీపీ అభయ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. కాగా, 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి జరుగగా, ఆపై 2011లో తొలిసారి, 2013లో మరోసారి యాసిడ్‌ దాడి జరిగింది. ప్రస్తుతం బాధితురాలు లక్నోలో యాసిడ్ బాధితులు నిర్వహిస్తున్న ఓ హోటల్ లో పని చేస్తోంది.

More Telugu News