: మాంసం తీసుకెళుతున్న వ్యక్తిని హత్య చేసిన కేసులో బీజేపీ నేత అరెస్ట్!

గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మోదీ చేసిన హెచ్చరికల తరువాత, కఠిన చర్యలు మొదలయ్యాయి. గత వారంలో తన కారులో మాంసం తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపడమే కాకుండా, కారును దహనం చేసిన కేసులో జార్ఖండ్ లోని రామ్ గఢ్ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నిత్యానంద మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానిక పార్టీ నేత పప్పూ బెనర్జీ, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

గురువారం నాడు అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా కొట్టి, అతని మారుతి వ్యాన్ ను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యానంద ప్రోద్బలంతోనే అల్లరిమూక రెచ్చిపోయినట్టు తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని అనుమానిస్తున్నామని, నిత్యానందకు, అలీముద్దీన్ కూ పాత గొడవలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గో రక్షణ పేరిట హత్య జరిగి వుండవచ్చన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News