: వైకాపా వైపు చూస్తున్న రామసుబ్బారెడ్డి... రంగంలోకి దిగిన లోకేశ్

వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆదినారాయణరెడ్డి మంత్రి పదవిని పొందిన తరువాత, తనకు ప్రాధాన్యం తగ్గిందన్న భావనలో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైకాపా వైపు చూస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు, పరిస్థితి చెయ్యి దాటనీయకుండా చూసేందుకు మంత్రులు లోకేశ్, కళా వెంకట్రావును రంగంలోకి దించారు. సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లనే శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడారని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్న వేళ, ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకూడదన్న భావనలో ఉన్న సీఎం, రామసుబ్బారెడ్డిని శనివారం నాడు పిలిపించుకుని కాసేపు మాట్లాడారు.

నియోజకవర్గంలో ఆది నుంచి పార్టీతో కలిసున్న తనకు ఎంతమాత్రమూ విలువ లేకుండా పోయిందని చంద్రబాబు వద్ద ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు ఎదురవుతున్న సమస్యలను రామసుబ్బారెడ్డి ఏకరువు పెట్టగా, అన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పిన చంద్రబాబు, ఆ బాధ్యతను లోకేశ్ కు అప్పగించారు. పరిస్థితి ఇలానే ఉంటే క్యాడర్ కనిపించకుండా పోతుందని, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికే విలువ ఉంటోందని లోకేశ్, కళా వెంకట్రావుల వద్ద ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News