: టేకాఫ్ తీసుకుంటుండగా పేలిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం టైరు

విమానం గాల్లోకి లేస్తుండగా టైరు పేలిన ఘటన పాట్నాలో చోటుచేసుకుంది. దీంతో విమానంలో ప్రయాణికులతో పాటు, ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా ఆందోళనకు గురయ్యారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... పాట్నా నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పాట్నా ఎయిర్ పోర్టులో టేకాఫ్ కు సిద్ధమైంది. గాల్లోకి లేస్తుండగా టైరు పేలింది. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. పెద్ద శబ్దం రావడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక తీవ్రగందరగోళానికి గురయ్యారు.

దీంతో విమానాన్ని పైలట్ మళ్లీ ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా ప్రయాణికులను వేగంగా దించేశారు. దీంతో నాలుగు విమానాలు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది. దీనిపై ఇండిగో సిబ్బంది మాట్లాడుతూ, విమాన టైరు పేలలేదని, ఇంజిన్ స్తంభించడంతో విమానం తక్కువ వేగంతో కదిలిందని, అదే సమయంలో క్యాబిన్‌ నుంచి పొగ వస్తున్నట్టు గుర్తించడంతో విమానాన్ని నిలిపేశామని తెలిపారు. దీనిపై డీజీసీఏకు తెలిపామని, వారు దర్యాప్తుకు ఆదేశించారని చెప్పారు. 

More Telugu News