: ఐఎస్ఐఎస్ చీఫ్ బగ్దాదీ మరణించాడంటున్న ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు!

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ మరణించాడా? లేదా? అన్నదానిపై ఇరాన్ మీడియా తాజాగా కథనాలు ప్రచురించింది. గత నెలలో ఉత్తర సిరియాలోని రక్కాలో వందలాది మంది ఐఎస్ ఉగ్రవాదులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బగ్దాదీ కూడా హాజరైనట్టు సమాచారం. విషయం తెలిసిన రష్యా సమావేశానికి వచ్చిన ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో బగ్దాదీ మరణించాడని రష్యా ప్రకటించింది.

 అయితే ఇలా ప్రకటన వెలువడ్డ ప్రతిసారీ ఏదోఒక రూపంలో బగ్దాదీ బతికి ఉన్నాడన్న ఆధారాలు లభ్యమయ్యేవి. ఈ దాడి తరువాత అలాంటివేవీ కనిపించలేదు. దీంతో బగ్దాదీ మరణించాడని ఇరాన్ మీడియా ప్రకటించింది. బగ్దాదీ కచ్చితంగా చనిపోయి ఉంటాడని తన కథనాల్లో పేర్కొంది. ఇరాన్ క్యుడ్స్ ఫోర్స్‌ కు చెందిన అలీ షిరాజీ అనే అధికారిని ఉంటంకిస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో బగ్దాదీ మరణించాడని ప్రకటించింది. అయితే దానిని కాసేపటికే సవరించిన ఆ సంస్థ అందులో బగ్దాదీ మృతిని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆ న్యూస్ ఏజెన్సీకి బగ్దాదీ ఉనికి గురించి ఏదైనా విషయం తెలిసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News