: వారణాసిలో 70 ఏళ్ల ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం.. దాడిచేసి గాయపరిచి అత్యాచారానికి పాల్పడిన గార్డు

మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న 70 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ ఓ గార్డు చేతిలో అత్యాచారానికి గురైంది. వారణాసిలోని మధోపూర్ గ్రామంలో ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఇక్కడి గ్రామీణ మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నారు. బాధిత మహిళ గత 11 నెలలుగా ఇక్కడ ఉంటోంది.

మీర్జాపూర్‌కు చెందిన ఓంప్రకాష్ అనే వ్యక్తి ఆమె ఉంటున్న రిసార్ట్ ‌కు గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తాగిన మత్తులో ఉన్న ఓంప్రకాష్ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే లోపే గార్డు పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను ఆసుపత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు.

 ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు శాంపిళ్లు సేకరించారు. జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) యోగేశ్వర్ రామ్ మిశ్రా, సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ ఆసుపత్రిని సందర్శించి మహిళను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News