: మహిళల వరల్డ్ కప్: సెంచరీ బాదిన స్మృతి.. విండీస్‌పై భారత్ ఘన విజయం!

ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ స్మృతి మందన విండీస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. టాంటన్‌లోని కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో విండీస్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ విమెన్‌లలో హేలీ మాథ్యూస్ (43), షానెల్ డాలీ (33), ఆఫీ ఫ్లెచర్ (36) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి ప్రత్యర్థి భారత్ ముందు ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా ఎక్తా బిష్త్ ఓ వికెట్ నేల కూల్చింది.

అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 45 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందన 108 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 106 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (46) పరుగులు చేయగా పూనమ్ రౌత్ డకౌట్ కాగా మోనా మెష్రమ్ (18) పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మందనకు దక్కింది.

More Telugu News