: బాలుడిని కిడ్నాప్ చేసి.. వాట్సాప్‌లో రూ.1.8 లక్షలకు అమ్మకానికి పెట్టిన మహిళ!

రెండున్నరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు చిన్నారిని వాట్సాప్‌లో రూ.1.8 లక్షలకు అమ్మకానికి పెట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ మహిళలను అక్రమ దత్తత, సరోగసీ రాకెట్‌కు చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు.

బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళలు ఢిల్లీలోని ఆరు ప్రాంతాలకు తిప్పారు. అనంతరం ఎక్కువ డబ్బులకు బాబును విక్రయించే ఉద్దేశంతో ఓ మహిళ చిన్నారి ఫొటోను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసి అమ్మకానికి పెట్టింది. అయితే అప్పటికే కిడ్నాప్ గురించి పోలీసులకు ఉప్పు అందడం, వాట్సాప్‌లో బాలుడి ఫొటోను చూసిన ‘కొనుగోలుదారు’ మహిళలను హెచ్చరించడంతో భయపడిన మహిళ రఘువీర్ నగర్‌లోని ఓ ఆలయం వద్ద బాబును వదిలేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు  నటిస్తూ పోలీసులకు ఫోన్ చేసి బాలుడి వివరాలు తెప్పింది.

ఆమెకు రివార్డు ఇచ్చే ఉద్దేశంతో పోలీసులు ఆమెకు ఫోన్ చేసి పిలిపించగా అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ వెనక ముగ్గురు మహిళలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను రాధ (40), సోనియా (24), సరోజ్ (34)లుగా గుర్తించారు.

తొలుత బాలుడిని కిడ్నాప్ చేసిన రాధ కొన్ని రోజులపాటు తన వద్దే ఉంచుకుని అనంతరం సోనియాకు  లక్ష రూపాయలకు విక్రయించింది. సోనియా కూడా బాలుడిని రూ.1.10 లక్షలకు సరోజకు విక్రయించింది. ఆమె బాలుడి ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టి రూ.1.8 లక్షలకు అమ్మకానికి పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.

More Telugu News