: వైసీపీ నేతలు ఎటు తిప్పయినా మాట్లాడగలరు: టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపాటు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మరోమారు మండిపడ్డారు. ఇమేజ్ పెంచుకోవడం కోసమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడిలో అనిత మీడియాతో మాట్లాడారు. విశాఖ భూకుంభకోణం విషయమై టీడీపీ మంత్రులపై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించగా.. ‘కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా, వైఎస్సార్సీపీ నేతలు ఎటుతిప్పి అయినా మాట్లాడగలరని చెప్పడానికి వారి మాటలే నిదర్శనం. మొన్నటికి మొన్న ఈ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని వారు కోరారు. ఈ కుంభకోణంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. మంత్రి గంటా గారు స్వయంగా సీబీఐ విచారణకు సిద్దమని చెప్పిన తర్వాత, గంటా-అయ్యన్న మధ్య సయోధ్య కుదిరిందని రోజా అంటున్నారు. వారి మధ్య సయోధ్య కుదిరిందని అంత కచ్చితంగా చెబుతున్న రోజా, ఆ సయోధ్య తనే కుదిర్చిందేమో!

అసలు వైజాగ్ ఇమేజ్ పై వైసీపీ నేతలు ఎందుకంత అసూయ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇండియాలోనే మంచి స్మార్ట్ సిటీ అయిన వైజాగ్ పై బురద జల్లడాన్ని ఉపేక్షించకూడదు. ఈ రోజు లక్షల ఎకరాలు ట్యాంపరింగ్ అయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. మరి, భూములు కోల్పోయిన వారెవ్వరూ ఎందుకు ముందుకు రావడం లేదు? బాధితుల్లో కనీసం ఇద్దరిని లేదా ముగ్గురిని సిట్ ముందుకు వైఎస్సార్సీపీ ఎందుకు తీసుకురాలేకపోతోంది? ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో బురదచల్లాలనే ఉద్దేశంతో కాకుండా బాధ్యతగా, ఆధారాలతో సిట్ ముందుకు రావాలి...

రోజా సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు. రోజా తన ఇమేజ్ పెరుగుతుందని చెప్పి చంద్రబాబు, లోకేశ్ పై ఆరోపణలు చేస్తున్నారు. దీనివల్ల రోజా ఇమేజ్ రోజురోజుకీ పడిపోతోందనే విషయం ఆమెకు అర్థం కావట్లేదు. నోబెల్ ప్రైజ్ ఎవరైనా సాధిస్తే మేము ఇంత ఆఫర్ చేస్తామని గతంలో చెప్పామనే విషయాన్ని చంద్రబాబుగారు మాట్లాడితే.. నోబెల్ ప్రైజ్ ఇచ్చేందుకు చంద్రబాబు ఎవరంటూ వైఎస్సార్పీపీ నేతలు మాట్లాడుతున్నారు! అసలు, వాళ్లు మాట్లాడే మాటలకు పొంతనే లేదు’ అని అనిత మండిపడ్డారు.

More Telugu News