: నల్లమలలో కరుడుగట్టిన హర్యానా వేటగాళ్లు... జల్లెడ పడుతున్న పోలీసులు

హర్యానాకు చెందిన వేటగాళ్లు నల్లమల అడవుల్లోకి ప్రవేశించారన్న సమాచారాన్ని తెలుసుకున్న ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లా పోలీసులు వారి కోసం జల్లెడ పడుతున్నారు. పెద్ద పులులను వేటాడేందుకు నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి దుండగులు ప్రవేశించారు. హర్యానాకు చెందిన కరుడుగట్టిన జంతు వేటగాళ్లు లక్ష్మీచాంద్, పప్పు, లీలావతి తదితరులు ఈ టీమ్ లో ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులకు దిగారు. వీరు శ్రీశైలం పరిసరాల నుంచి అడవుల్లోకి ప్రవేశించి వుంటారని అనుమానిస్తున్నారు. నల్లమల పరిసరాల్లో అనుమానితులు కనిపిస్తే, తమకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానితుల వివరాలను 9440810058, 9493547206 నంబర్లకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. ఈ ప్రాంతంలోని తండాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో లక్షల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో పలు రకాల క్రూర జంతువులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా గుర్తిస్తూ, వేటను ఎన్నో సంవత్సరాల క్రితమే నిషేధించారు. 

More Telugu News