: ప్రభాస్ అన్న మాటలన్నీ వినిపించాయి... మౌనంగా వెనక్కి వచ్చేశాను...అప్పటి నుంచి ఎవరినీ నమ్మకూడదనుకున్నాను!: డాన్స్ మాస్టర్ రాకేష్

ప్రముఖ నటుడు ప్రభాస్ గురించి డాన్స్ మాస్టర్ రాకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మనిషి ఎదుగుదల ఎవరినైనా మార్చేస్తుందని రాకేష్ మాస్టర్ తెలిపారు. యూట్యూబ్ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, సినిమాల్లోకి రాకముందు ప్రభాస్ తన దగ్గరే డాన్స్ నేర్చుకున్నారని చెప్పారు. ప్రభాస్ ను సొంత బిడ్డగా భావించేవాడినని ఆయన తెలిపారు. ప్రభాస్ కు డాన్స్ నేర్పించాలంటూ కృష్ణంరాజుగారు తనకు అప్పగించినప్పుడు ప్రభాస్ సన్నగా ఉండేవాడని అన్నారు. ప్రభాస్ డాన్స్ నేర్చుకునే రోజుల్లో తానింతవరకు ఎవరి కాళ్లకు నమస్కరించలేదని, కేవలం ఇద్దరి పాదాలకే నమస్కరించానని, ఒకరు సత్యానంద్ అయితే రెండు రాకేష్ మాస్టర్ అని చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ చాలా మంచి మనిషి అని, ఈశ్వర్ సినిమాకు ముందు తనకు రావాల్సింది 8 వేల రూపాయల ఫీజు అయితే తనకు 15,000 రూపాయలు ఇచ్చిన గొప్పవ్యక్తి అని చెప్పారు. అలాగే తనకు ఒక కారు కూడా బహుమతిగా కొనిచ్చారని అన్నారు.

 అయితే ఆయన గాయత్రిహిల్స్ కు నివాసం మార్చిన అనంతరం ఆయనను కలుద్దామని శేఖర్ మాస్టర్ తో కలిసి వెళ్లినప్పుడు... ఇంట్లో ఆయన మేనేజర్ ప్రభాస్ శీను 'మీరెవరు?' అంటూ అడ్డుకున్నాడని, దీంతో 'రాకేష్ మాస్టర్ వచ్చారని చెప్పు' అనడంతో లోపలికెళ్లిన ఆయన చెప్పాడని, వెంటనే ప్రభాస్ అన్నమాటలు తమకు వినిపించాయని, దీంతో వెనుదిరిగామని అన్నారు. ఆయన కమర్షియల్ గా మారిపోయారని అర్థమైన తరువాత ఇంకెప్పుడూ ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, మనం విద్య నేర్పించడం వరకే తప్ప అంతకు ముందుకెళ్లకూడదని రూఢీ అయిందని ఆయన చెప్పారు.

More Telugu News