: సాదత్‌ ఖాన్‌ అలియాస్ రాహుల్ అలియాస్ కార్తీక్ అలియాస్ ప్రీతమ్‌ కుమార్... ఏకంగా 100 మంది యువతులను మోసం చేసి కటకటాల వెనక్కి!

సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ యాప్ లతో పాటు పలు మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పెట్టి, సుమారు 100 మంది యువతులను మోసం చేయడంతో పాటు, పలువురికి మాయమాటలు చెప్పి లోబరచుకున్న సాదత్ ఖాన్ అనే యువకుడిని బెంగళూరులోని బాగలూరు పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. ఇతని మోసాల చిట్టా చూసి పోలీసులే తెల్లబోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హసన్ లో ఐటీఐ వరకూ చదివి, ఆపై మద్యానికి బానిసైన సాదత్ ఖాన్ ను తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆపై యశ్వంత్ పూర్ లో ఓ వెల్డింగ్ షాపులో, ఆపై కంట్రీ క్లబ్ లో టెలీ కాలర్ గా పని చేశాడు. సిస్కో, హాలెక్స్ కంపెనీల్లో టెలీకాలర్ గా పని చేస్తున్న సమయంలో అమ్మాయిలను వేధించడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆపై సాదత్ ఖాన్ పలు వెబ్ సైట్లలో రాహుల్, కార్తీక్, మహమ్మద్‌ ఖాన్, ప్రీతమ్‌ కుమార్ తదితర పేర్లతో ప్రొఫైల్స్ సృష్టించి, తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని, కంపెనీ సీఈఓనని, ప్రభుత్వ అధికారినని వివాహం కోసం ఎదురుచూసే యువతులను ఆకర్షించడం మొదలు పెట్టాడు. కాంటాక్టులోకి వచ్చిన వారిని వివాహం చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తాల్లో డబ్బు రాబట్టేవాడు. ఒకరి వద్ద తీసుకున్న డబ్బుతో, మరో యువతితో కలసి జల్సాలు చేసేవాడు. స్టార్ హోటళ్లకు వారిని తీసుకువెళ్లి, కార్లలో తిప్పి, అవసరం వచ్చిందని మాయమాటలు చెప్పి డబ్బు లాగి మాయమయ్యేవాడు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వలపన్ని అరెస్ట్ చేశారు. ఇతనిపై యలహంక, విద్యారణ్యపుర, కేఆర్‌ పుర, జయనగర, హెబ్బగోడి. దొడ్డబళ్లాపుర, మైసూరు, ధారవాడ తదితర ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని, ఇతని బారినపడ్డ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

More Telugu News