: శిరీష ఆత్మహత్యకు కారణాలివేనా?

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో... ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను పోలీసులు మరోసారి నిర్ధారించుకున్నారు. రాజీవ్ తో అనుబంధంలో ఉన్న శిరీషకు కుక్కునూరుపల్లి వెళ్లిన తరువాత వివిధ విషయాలు తెలిశాయని, వాటిని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తేజస్వినితో వివాదం అనంతరం రాజీవ్ తనకు మరింత దగ్గరవుతాడని శిరీష భావించిందని, అందుకే రాజీవ్, శ్రవణ్ తో కలిసి రాత్రి వేళ కుక్కునూరుపల్లికి వచ్చిందని తేల్చారు. అక్కడ ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడంతో ఆమెకు వివిధ విషాయాలపై క్లారిటీ వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ సహకరించాడన్న విషయం ఆమెకు అక్కడే అర్థమైంది.

రాజీవ్ కూడా తనను వంచించాడని అప్పుడే ఆమె అర్థం చేసుకుంది. సహకారం పేరుతో ఎస్సై ఆలోచనను శిరీష పసిగట్టింది. దీంతో ఆమె కారులో వారితో కలిసి వెళ్లేందుకు కూడా నిరాకరించింది. దీంతో శిరీషపై రాజీవ్, శ్రవణ్ దాడి చేసినట్టు గుర్తించారు. వారి వేధింపులతోనే కారులోంచి శిరీష దూకేసేందుకు ప్రయత్నించిందని వారే పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై మళ్లీ దాడి జరిగిందని, దీంతో రాజీవ్ వంచన, శ్రవణ్ నమ్మకద్రోహాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారిస్తున్నారు. కాగా, ఈ కేసులో శిరీష, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఈ రెండూ హత్యలేనని, పోలీసులే కేసును పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

More Telugu News