: చైనా లక్ష్యంగా భారత్-అమెరికాలు చెలిమి చేస్తే.. అది పెను విపత్తుకు దారితీస్తుంది.. హెచ్చరించిన డ్రాగన్ మీడియా!

భారత్‌పై చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ మరోమారు విషం కక్కింది. చైనా లక్ష్యంగా అమెరికాతో భారత్ చెలిమి చేస్తే తీవ్ర విపత్తు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. ‘‘చైనా ఎదుగుతుండడం భారత్, అమెరికాలకు కంటగింపుగా మారింది. చైనాపై భౌగోళిక రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్‌ను అమెరికా ఉపయోగించుకుంటోంది’’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. జపాన్, ఆస్ట్రేలియాల్లా భారత్ ఎప్పటికీ అమెరికాకు మిత్రదేశం కాలేదని అక్కసు వెళ్లగక్కింది. అప్పటి సోవియట్ యూనియన్, కెన్నడీ అధక్షుడిగా ఉన్న హయాంలో అమెరికా కలిసి చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకోవాలని భావించాయని, అయితే విజయం సాధించలేకపోయాని ఆరోపించింది.

1950 తొలి నుంచి 1960 చివరి వరకు ఆ రెండు దేశాలు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కార్డును ఉపయోగించుకోవాలనుకుని బొక్క బోర్లా  పడ్డాయని తీవ్రస్థాయిలో విమర్శించింది. చైనాకు భారత్ ఏ స్థాయిలోనూ సరితూగలేదని ప్రగల్భాలు పలికింది. ఆ విషయాన్ని చరిత్రే నిరూపించిందని వివరించింది. ‘జియోపొలిటికల్ ట్రాప్’ లో చిక్కుకోకుండా ఉండాలని భారత్‌కు సూచించింది. చైనాపై ఆందోళన మాని సుస్థిర సంబంధాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చింది.

More Telugu News