: గొప్ప క్రికెటర్‌ను అయ్యాకే మ‌ళ్లీ తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని లేఖరాసి... వెళ్లిపోయిన విశాఖ బాలుడు!

సినిమాల్లో, సీరియ‌ళ్ల‌లో, న‌వ‌ల‌ల్లో హీరోలు చిన్న‌ప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి, గొప్ప వారుగా ఎదిగి మ‌ళ్లీ త‌మ సొంత ఇంటికి చేరుకుంటారు. సినిమాల్లో చూపించే అలాంటి స‌న్నివేశాలు ఆ బాలుడి మీద ప్ర‌భావం చూపించిన‌ట్లున్నాయి. తాను గొప్ప‌వాడిన‌య్యాక తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని లేఖ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడో బాలుడు. విశాఖ‌ప‌ట్నంలో 12 ఏళ్ల‌ బాలుడు భువ‌న‌సాయికి క్రికెట్ పిచ్చి ఎక్కువ‌. తాను ధోనీలా క్రికెట‌ర్‌ని కావాల‌ని క‌ల‌లు క‌నేవాడు. ఈ క్ర‌మంలోనే నిన్న ఇంట్లోంచి వెళ్లిపోతూ త‌న తండ్రి జేబులో ఉన్న రూ.8000, ఓ ఏటీఎం కార్డు తీసుకుని, ఓ లెట‌ర్ రాసిపెట్టి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.

తాను ఢిల్లీకి వెళ్లి క్రికెట‌ర్‌ని అవుతాన‌ని, 5 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ తిరిగి వ‌స్తానని అందులో పేర్కొన్నాడు. త‌న గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే తాను ఎప్ప‌టికీ ఇంటికి రాన‌ని లేఖ‌లో బెదిరించాడు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడి కోసం గాలిస్తున్నారు. ఆ బాలుడు ఏటీఎం కార్డునుంచి డ‌బ్బు తీస్తే అత‌డు ఎక్క‌డ ఉన్నాడో తెలుసుకోవ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.          

More Telugu News