: శిరీష కేసులో కీలక విషయాలు వెల్లడించిన శ్రవణ్

బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో, ఆమె స్నేహితుడు శ్రవణ్ పోలీసులకు కీలక సమాచారాన్ని అందించాడు. ఈ కేసులో మరో ఇద్దరు ఎస్ఐల పేర్లను ఆయన చెప్పాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు, మే 30, 31న కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, ఓ సమస్య ఉందని, దాన్ని సెటిల్ చేయాలని కోరానని శ్రవణ్ తెలిపాడు.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోని ఎస్సై హరీందర్ కు ఫోన్ చేసిన ప్రభాకర్ రెడ్డి, ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని 31వ తేదీన కోరాడని, అయితే, దీన్ని మరో ఎస్ఐ శ్రీనివాస్ విచారిస్తున్నట్టు హరీందర్ చెప్పాడని అన్నాడు. ఆ తరువాత మరో రెండు సార్లు ప్రభాకర్ రెడ్డితో తాను మాట్లాడానని, కేసును సెటిల్ చేయడంలో బంజారాహిల్స్ పోలీసులు విఫలం కావడంతోనే, ప్రభాకర్ రెడ్డి తమను కుకునూరుపల్లికి పిలిచారని శ్రవణ్ చెప్పాడు.

జూన్ 4న రాజీవ్, శిరీషలతో కలసి బంజారాహిల్స్ పీఎస్ కు వెళ్లామని, కేసు ఎటూ తేలకపోవడంతోనే 12న కుకునూరుపల్లికి వెళ్లామని అన్నాడు. శిరీషను ఎస్ఐ ప్రభాకర్ ఏం చేశాడన్న విషయం తనకు తెలియదని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు నిన్న రాజీవ్ చెప్పిన అంశాలను, నేడు శ్రవణ్ చెప్పిన అంశాలను బేరీజు వేస్తున్నారు. శ్రవణ్ ను మరింతగా విచారించాల్సి వుందని, నేడు, రేపు శ్రవణ్ ను మరింత లోతుగా ప్రశ్నించి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News