: శిరీష ఆత్మహత్య కేసులో నోరు విప్పిన నిందితుడు రాజీవ్... విచారణలో సంచలన విషయాలు వెల్లడి!

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో రాజీవ్, శ్రవణ్ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం వీరిని హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ రోజున శిరీషను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లామని, శ్రవణ్ తనకు అన్ని విధాలా సహకరించాడని నిందితుడు రాజీవ్ చెప్పినట్టు తెలుస్తోంది. తన ప్రియురాలు తేజస్వినిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని, తమ ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, పెళ్లికి ముందే శిరీషను, తేజస్వినిని వదిలించుకోవాలని అనుకున్నానని, అయితే, శిరీషను చంపాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదని రాజీవ్ చెప్పినట్టు తెలుస్తోంది.

తేజస్విని తనను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని తన తల్లికి చెప్పిందని, అందుకు తన ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని, ఆ తర్వాత శిరీషతో గొడవపడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తేజస్విని వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పోలీసుల విచారణలో రాజీవ్ చెప్పినట్టు సమాచారం. శిరీష, తేజస్విని మధ్య గొడవతో నలిగిపోయి, శ్రవణ్ సాయంతో ఎస్పై ప్రభాకర్ రెడ్డికి చెప్పి శిరీషను బెదిరించాలని అనుకున్న విషయాన్ని రాజీవ్ బయటపెట్టాడు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఏం చేశాడో తెలియదు కానీ, శిరీష మనస్తాపానికి గురైందని చెప్పాడు. కారులో తిరిగి వస్తుండగా శిరీష అరుపులు, కేకలతో ఎవరైనా చూస్తారనే భయంతో ఆమెపై దాడి చేశానంటూ నిందితుడు రాజీవ్ చెప్పినట్టు తెలుస్తోంది.

More Telugu News