: ఒంటిపై కిరోసిన్ పోసుకున్న భార్య.. నిప్పంటించిన భర్త!
అమరావతిలోని తుళ్లూరు మండలం వెంకటాయపాలెం గ్రామంలో వివాహేతర సంబంధం భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. ఈ క్రమంలో భర్తతో గొడవపడ్డ భార్య ఆవేశంలో ఒంటిపై కిరోసిన్ పోసుకోగా భర్త ఆమెకు నిప్పంటించాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... చీరాలలోని తోటావారిపాలెం గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారి(25) బీఎస్సీ నర్సింగ్ విద్య పూర్తి చేసింది. ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారు ఇద్దరూ వెంకటాయపాలెంకు వలస వచ్చి అక్కడే పనిచేసుకుంటున్నారు.
పనికి వెళ్లిన అశోక్ భోజనానికి ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఎంత సేపు తలుపుకొట్టినా భార్య తీయలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ ఇంట్లో నుంచి గ్రామ పంచాయతీ గుమస్తా పి.సత్యనారాయణ పరుగులు తీస్తూ బయటకు వచ్చి, అశోక్ను తోసుకుంటూ పారిపోయాడు. సత్యనారాయణ తమ ఇంట్లో ఏం చేస్తున్నాడని భార్యను ఆయన నిలదీశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రశాంతి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. అదే కోపంలో అశోక్ ఆమెకు నిప్పు అంటించాడు. అనంతరం ఆయనే మంటలు ఆర్పి ఆమెను బయటకు తీసుకొచ్చాడు. ఆ భర్తకు కూడా నిప్పు అంటుకుంది. స్థానికులు వారిద్దరినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రశాంతి మృతి చెందింది.