: తదుపరి వన్డేలో ధోనీ స్థానంలో రిషబ్‌ పంత్‌కి ఛాన్స్ ఉండొచ్చు!: కోహ్లీ

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్‌ పంత్‌ను సెలెక్ట‌ర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయ‌న‌కు వెస్టిండీస్‌లో ప్రాక్టీసు సంద‌ర్భంగా టీమిండియా స్టార్ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెల‌కువ‌లు కూడా నేర్పించాడు. ఆ కొత్త కుర్రాడు ధోనీ త‌ర్వాత ధోనీ అంత‌టి వాడు అవ్వాల‌ని సెలెక్ట‌ర్లు కోరుకుంటుండ‌గా రిష‌బ్‌ పంత్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తదుపరి వన్డేలో రిషబ్ పంత్‌కి జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని చెప్పాడు.

ఈ నెల 30న వెస్టిండీస్‌తో భారత్ కు మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లోనే జట్టులో కొన్ని మార్పులు చేస్తామని, కొత్త వారికి అవకాశం ఇస్తామని కోహ్లీ తెలిపాడు. ఈ వ‌న్డేలో రిష‌బ్ పంత్‌ చోటు దక్కించుకుంటే అదే అతని తొలి ఇంట‌ర్నేష‌న‌ల్ వన్డే కానుంది. వెస్టిండీస్ టూర్‌లో రోహిత్‌ శర్మ, బుమ్రాల‌కి విశ్రాంతి ఇచ్చి వారి స్థానంలో రిషబ్‌పంత్‌, కుల్దీప్‌లను తీసుకున్న విష‌యం తెలిసిందే. కోహ్లీ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ధోనీ స్థానంలో ఇక‌ రిషబ్‌పంత్‌కి అవకాశం ఇచ్చి వికెట్‌ కీపర్‌ బాధ్యతలు అప్పగిస్తార‌ని క్రికెట్ విశ్లేష‌కుల అంచ‌నా.

More Telugu News