: చివరిగా ఆలయంలో హుండీ వద్ద కనిపించిన కుంజా భిక్షం... ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ లు వెతికినా కానరాని జాడ!

శనివారం రాత్రి తన కుమార్తె, అల్లుడులతో కలసి శ్రీవారి దర్శనానికి వెళ్లి అదృశ్యమైన బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఘటన ఇప్పుడు తిరుమల పోలీసులకు సవాల్ గా మారింది. ఆయన కనిపించడం లేదన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, వారు గుడిలోకి వెళ్లినప్పటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరిగా ఆయన శ్రీవారి హుండీ వద్ద కనిపించారు. హుండీ సమీపంలో కుంజా భిక్షంతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు కూడా కనిపించారు. ఆపై మరెక్కడా ఆయన జాడ తెలియలేదు.

ఆలయం లోపలి మిగతా కెమెరాలు, బయట కెమెరాలు పరిశీలించినా జాడ కనిపించలేదు. కాగా, లోపల తాము హుండీ దగ్గర ఉన్న సమయంలో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చారని, ఆ సమయంలో రోప్ పార్టీ తమను తండ్రితో వేరు చేసిందని ఆయన కుమార్తె మీడియాకు తెలిపారు. ఆయన ఎక్కడున్నారన్న విషయాన్ని సాధ్యమైనంత త్వరగా కనిపెడతామని తిరుమల వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

More Telugu News