: కిదాంబికి నా వ్యక్తిగత కానుకగా ‘టీయూవీ 300’ బహూకరిస్తా!: మహీంద్రా గ్రూప్ చైర్మన్

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత కిదాంబి శ్రీకాంత్ కు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ రూ.5 లక్షలు కానుకగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన తరపున శ్రీకాంత్ కు ఓ కారును బహూకరించనున్నట్టు ప్రకటించారు.

ఈ సూపర్ సిరీస్ లో శ్రీకాంత్ విజయం సాధించగానే ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ...‘అతను గెలిచాడు! ఇప్పుడు అధికారికంగా శ్రీకాంత్ ‘స్టీమ్ రోలర్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ కు స్పందించిన ఓ అభిమాని..‘సార్, శ్రీకాంత్ కు బహుమతిగా కేవలం రూ.5 లక్షలే వచ్చాయి. క్రికెట్ క్రీడలో విజయం సాధించిన వారితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్లీజ్, మీరు ఏదైనా చెయ్యండి’ అని కోరాడు.

ఆ అభిమాని ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహీంద్రా..‘అలాగే, శ్రీకాంత్ పోరాట స్ఫూర్తి మనం గర్వపడేలా చేసింది. ‘బ్యాటిల్ ట్యాంక్’ను పొందేందుకు ‘స్టీమ్ రోలర్’ అర్హుడు. నా వ్యక్తిగతంగా 'టీయూవీ 300' కానుకగా ఇస్తాను’ అని ఆయన పేర్కొనడం విశేషం. కాగా, ఈ సిరీస్ లో కిదాంబి విజయం సాధించడానికి ముందు ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. ‘కిదాంబి శ్రీకాంత్ ను ‘స్టీమ్ రోలర్’ అనే నిక్ నేమ్ తో పిలుచుకునే అవకాశం కొంచెం సేపట్లోనే రానుంది’ అని పేర్కొన్నారు.

More Telugu News