: నా మనసును దోచుకున్న గ్రామమిదే: ప్రధాని మోదీ

తమ గ్రామంలో టాయిలెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకోకుండా, గ్రామస్థులు ఎవరికి వారే సొంత డబ్బుతో మరుగుదొడ్లు కట్టించుకుని బిజ్నూర్ వాసులు తన మనసును దోచుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి మాధ్యమంగా తన 33వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, రంజాన్ పర్వదినం జరుపుకోవడానికి సిద్ధమైన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. క్లీన్ ఇండియా కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉద్యమం, ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. ఎమర్జెన్సీ సమయాన్ని గురించి ప్రస్తావించిన మోదీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రచించిన ఓ పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. దేశంలోని అత్యయిక స్థితి, ప్రజలను ఏకతాటిపై నడిపించి, ప్రజాస్వామ్య విలువలను పెంచిందని తెలిపారు.

తనకు అహ్మదాబాద్ కు చెందిన డాక్టర్ అనిల్ సోనారా నుంచి ఓ విలువైన సలహా వచ్చిందని, ఎవరైనా ఎవరికైనా బహుమతులు ఇవ్వాలంటే మంచి పుస్తకాలను ఇచ్చేలా తన నోటి నుంచి సలహా ఇవ్వాలని ఆయన కోరారని చెప్పిన మోదీ, పుస్తకాలతో పాటు ఖద్దరు దుస్తులను బహుమతులుగా ఇవ్వాలని అన్నారు. అహ్మదాబాద్ లో 21వ తేదీన యోగా దినోత్సవం సందర్భంగా 55 వేల మంది ఒకే ప్రాంతంలో యోగా చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారని అన్నారు. నేటి సూపర్ సిరీస్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాలని యావత్ భారతావని కోరుకుంటోందని తెలిపారు.

More Telugu News