: మూడు రోజులుగా ఢిల్లీ వైద్యుల పరీక్షలు... రేపు కేసీఆర్ కు శస్త్రచికిత్స!

గడచిన మూడు రోజులుగా, ఢిల్లీలోని కేసీఆర్ అధికార నివాసమైన తుగ్లక్ రోడ్డులోని 23వ నంబర్ ఇంటికి వచ్చి కంటి పరీక్షలు చేస్తూ, చుక్కల మందు వేస్తున్న వైద్యులు రేపు ఆయనకు శస్త్రచికిత్సను నిర్వహించనున్నారు. కుడి కంటిపై పొర ఏర్పడటంతో ఆయన చూపు మందగించగా, సోమవారం నాడు ఆపరేషన్ చేసి ఆ పొరను తొలగించనున్నారు.

 కాగా, గత నెలలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనే కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని కేసీఆర్ భావించినప్పటికీ, మందులు వాడటం ద్వారా పొరను తొలగించేందుకు ప్రయత్నిద్దామన్న వైద్యుల సలహాతో వెనుకంజ వేశారు. ఆపై ఆపరేషన్ చేస్తేనే మేలని, గతంలో కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వేళ కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్ సచ్ దేవ్ సూచించడంతో, ఇప్పుడు అంగీకరించారు. కాగా, ఆపరేషన్ అనంతరం మూడు రోజులు విశ్రాంతి తీసుకునే కేసీఆర్, 30వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా జరిగే జీఎస్టీ ప్రారంభ వేడుకల్లో పాల్గొని ఆపై హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

More Telugu News