: యూపీలో పరువు హత్య.. 22 ఏళ్ల కూతురిని సజీవ దహనం చేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో మహిళనూ కాల్చేసిన కిరాతకుడు!

కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కుమార్తెనే సజీవ దహనం చేశాడో తండ్రి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్ఫాషా మూడేళ్ల క్రితం సజ్జాద్ అనే వ్యక్తిని తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. దీంతో ఆమె తండ్రి మష్రూప్ రజాఖాన్ ఆగ్రహంతో ఊగిపోతూ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. శుక్రవారం గుల్ఫాషా తన రెండేళ్ల కుమారుడు, మరదలుతో కలిసి ఇంట్లో ఉంది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు.

దీనిని అవకాశంగా తీసుకున్న రజాఖాన్ కుమార్తె ఇంటికి వెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గమనించిన గుల్ఫాషా మరదలు షబ్నూర్ అరిచేందుకు ప్రయత్నించగా ఆమెపైనా కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఘటనా స్థలంలోనే వారు సజీవ దహనమయ్యారు. రెండేళ్ల బాబు మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. ఇది పరువు హత్యేనని ఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. సజ్జాద్‌‌తోపాటు మరో 11 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు.

More Telugu News