: ఏపీఎన్జీవోస్ భవనంపై మళ్లీ రాజుకున్న వివాదం.. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య గొడవ!
హైదరాబాద్ నాంపల్లిలోని ఏపీఎన్జీవోస్ భవనం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల మధ్య మరోమారు వివాదం రాజుకుంది. భవనాన్ని విభజించాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతుండగా దానిని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. అది పూర్తిగా ఏపీఎన్జీవోస్కు చెందిన భవనమని, దానిని విభజించే ప్రసక్తే లేదని వాదిస్తోంది.
తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగుల మధ్య వివాదం చెలరేగడానికి కారణం హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా నోటీసులేనని తెలుస్తోంది. ఈ భవనాన్ని టీఎస్ ఉద్యోగులతో కలిసి పంచుకోవాలని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్కు ఆయన నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ఉద్యోగులు ఈ విషయాన్ని తొలుత తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు.
హైదరాబాద్ కలెక్టర్ జారీ చేసిన నోటీసులను ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్ బాబు ఖండించారు. 1970లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులందరూ కలిసి రూపాయి చొప్పున చెల్లించి ఈ భవనం కోసం భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని, దీనిపై అటు ఏపీ ప్రభుత్వానికి కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ హక్కులేదని తేల్చి చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ అధికారులను కలిసి కలెక్టర్ నోటీసులను ఉపసంహరించుకోమని కోరుతామని, ఆ పనిచేయకుంటే కోర్టుకు వెళతామని అశోక్ బాబు హెచ్చరించారు.
కాగా, ఏపీఎన్జీవోస్ వాదనను టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి కొట్టిపడేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనాన్ని ఇటీవల విభజించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఆ భవనాన్ని విభజించగా లేనిది, ఏపీఎన్జీవోస్ భవనాన్ని విభజిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ భవనంలో మీటింగ్లు నిర్వహించుకునేందుకు తెలంగాణ ఉద్యోగులకు స్థలం కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.