: పాప బతికే ఉంది...మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి... అయితే, సమస్యలు ఎదురవుతున్నాయి!: ఎన్డీఆర్ఎఫ్ నిపుణుడు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనా ప్రాణాలతో ఉందని ఎన్డీఆర్ఎఫ్ నిపుణుడు తెలిపారు. గత రాత్రి నుంచి పాపను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఒక మనిషిని తల్లికిందులుగా లోపలికి పంపే ఆలోచన కూడా చేశామని, ఆయితే బోరు బావి లోపలికి వెళ్లే కొద్దీ భూమి కుంగిపోకుండా వేసిన రక్షణ పైపు అంతమైపోయిందని, దీంతో భూమిలోపలి రంధ్రం నేరుగా లేదని, మధ్యలో మట్టివంటివి పడ్డాయని ఆయన చెప్పారు. ఆక్సిజన్ అందుతుండడంతో పాప ప్రాణాలతోనే ఉందని ఆయన చెప్పారు.

దీంతో పాపను రోబోటిక్ హ్యాండ్ తో బయటకు తీసే ప్రయత్నం చేశామని, అయితే పాపను పట్టుకునేందుకు అక్కడ ఎలాంటి వెసులుబాటు లేదని, దీంతో రోబోటిక్ హ్యాండ్ ప్రయత్నం విఫలమవుతోందని ఆయన చెప్పారు. లోపల ఉన్న ఫుట్ వాల్వ్ ను బయటకు లాగడం ద్వారా పాపను బయటకు తీసే ప్రయత్నం కచ్చితంగా విజయవంతమవుతుందని అంచనా లేదని, దానికి తోడు పాప తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

18 గంటల నుంచి నిర్విరామంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, పాప క్షేమంగా ఉండాలని, పాప రావాలని కోరుకుంటున్నామని... అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యువకులు, పిల్లాపెద్దలు అంతా అక్కడే ఉన్నారు. మీనా తల్లిదండ్రులు విషణ్ణవదనంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

More Telugu News