: శ్రీనగర్ జామియా మసీదులో డీఎస్పీని కొట్టి చంపిన యువకులు... చనిపోయే ముందు ఫైరింగ్ చేసినా నిష్ఫలం!
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఘోరం జరిగింది. ఇక్కడి పాతబస్తీలోని ప్రసిద్ధ జామియా మసీదు వద్ద భద్రతా విధుల్లో ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ మహమ్మద్ అయూబ్ పండిత్ ను కొందరు యువకులు దారుణంగా కొట్టి చంపారు. తనను చుట్టుముట్టిన నిరసనకారులను నిలువరించేందుకు ఆఖరి నిమిషం వరకూ అయూబ్ ప్రయత్నించాడని, ఆత్మరక్షణార్థం ఫైరింగ్ ఓపెన్ చేయగా ముగ్గురు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ముగ్గురినీ కూడా అయూబ్ చంపాలని ప్రయత్నించలేదని, అందుకే మోకాళ్ల కిందకే కాల్చాడని అన్నారు. అతని మరణం తరువాత అతని రివాల్వర్ కనిపించకుండా పోయిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
దాడి జరిగిన సమయంలో అయూబ్ యూనిఫాంలో లేడని, అతని కుటుంబ సభ్యులు మొబైల్ ఫోన్ కు కాల్ చేసిన తరువాత మాత్రమే అతను డీఎస్పీ అని, స్థానికుడేనని తెలిసిందని ఓ అధికారి తెలిపారు. మరో పోలీసు అధికారి తన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటన తరువాత శ్రీనగర్ లోని 7 పోలీసు స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ పోలీస్ లైన్స్ లో నేటి ఉదయం అయూబ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని చూసిన సహచర ఉద్యోగులు బిగ్గరగా రోదించారు.
కాగా, నిన్న సుమారు 6 గంటలు సాగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతులవగా, అందుకు ప్రతీకారంగానే అయూబ్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది.