: చిక్కుల్లో శ్రీలంక స్టార్ క్రికెటర్.. మంత్రిపై కామెంట్లు ... విచారణ!

శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ చిక్కుల్లో పడ్డాడు. ఆ దేశ క్రీడా మంత్రిని కోతి అని సంబోధించిన విషయంలో మలింగపై విచారణకు ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. వివాదం వివరాల్లోకి వెళ్తే, తొలుత లంక క్రికెటర్లపై మంత్రి జయశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. పొట్టలు పెంచుకుని లావుగా తయారైన క్రికెటర్లు ఆట ఎలా ఆడతారని కామెంట్ చేశారు.

దీనిపై మలింగ స్పందిస్తూ, ఏసీ రూముల్లో కూర్చొని చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. చిలుక గూటి గురించి కోతులకు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశాడు. చిలక గూట్లోకి కోతులు వచ్చి మాట్లాడినట్టు ఉందని ప్రతిస్పందించాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న మంత్రి విచారణకు ఆదేశించారు. టీమ్ మొత్తాన్ని కలిపి తాను విమర్శిస్తే... మలింగకు మాత్రమే ఎందుకంత ఉలుకు? అని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లలోని కొవ్వు 16కు మించరాదని.. కొందరు ఆటగాళ్ల కొవ్వు 25 వరకు ఉందని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహక శిబిరానికి హాజరుకాకుండా... ఐపీఎల్ లో మలింగ ఆడటాన్ని మంత్రి తప్పుబట్టారు.

More Telugu News