: 'గంటాకింత....లోకేష్ కింత' అన్న పంపకాలు జరుగుతున్నాయి: జగన్ తీవ్ర ఆరోపణలు

విశాఖపట్టణంలో భూ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. సేవ్ విశాఖ పేరుతో మహాధర్నా నిర్వహించిన జగన్ మాట్లాడుతూ, వైజాగ్ భూకుంభకోణంలో గంటా పాత్ర ఉందని ఆరోపించారు. భారీ ఎత్తున భూములు కొట్టేసిన కబ్జా కోరుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడి ఆ డబ్బులు గంటా కింత, లోకేష్ కింత లెక్కన పంపకాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

 ల్యాండ్ పూలింగ్ పేరిట భయపెట్టి, ప్రభుత్వం సేకరిస్తే కనీసం రెండు లక్షలు కూడా ఇవ్వదని రైతులను భయబ్రాంతులకు గురి చేసి అప్పనంగా దోచేస్తున్నారని ఆయన తెలిపారు. గీతం యూనివర్సిటీ యజమాని చంద్రబాబుకు బంధువు కావడంతో ఆయన కబ్జా చేసిన 55 ఎకరాలను కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఆ భూములు అధికారికంగా ఆయనకు అప్పగించారని ఆయన తెలిపారు.

వైజాగ్ భూ కుంభకోణంలో టీడీపీ తీరు ఎలా ఉందంటే...రావణాసురుడు, సీతమ్మవారిని ఎత్తుకెళ్లాడా? లేదా? అన్నదానిపై కుంభకర్ణుడితో సిట్ వేయించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రావణాసురుడు చేసిన తప్పుపై కుంభకర్ణుడితో సిట్ వేయించకుండా ఆంజనేయుడితో సిట్ వేయిస్తే నిజానిజాలు తేలిపోతాయని ఆయన చెప్పారు. వైజాగ్ జిల్లా చంద్రబాబునాయుడుకు చాలా చేసిందని ఆయన చెప్పారు. మరి అలాంటి విశాఖపట్టణం జిల్లాకు చంద్రబాబునాయుడు స్కాములు, అవినీతి, దోచుకునేందుకు అనుమతులిచ్చాడని ఆయన విమర్శించారు. భూకుంభకోణంపై వివరణ అడిగితే కలెక్టర్ హుదూద్ లో ఫైళ్ళు గల్లంతయ్యాయని సమాధానమిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ గతంలో జీవీఎంసీ కమిషనర్ గా, జాయింట్ కలెక్టర్ గా, ఇప్పుడు కలెక్టర్ గా పని చేస్తున్నారని ఆయన తెలిపారు.

More Telugu News