: రోజాకు క్లాస్ పీకిన జగన్.. తీరు మార్చుకోవాలంటూ హెచ్చరిక?

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు వైసీపీలో కష్టాలు ప్రారంభమయ్యాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. అనునిత్యం టీడీపీపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడుతూ, ప్రతిరోజూ మీడియాలో హల్ చల్ చేసే రోజాకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారనే విషయం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రోజా వ్యవహారశైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు జగన్ కు ఇబ్బందిని కలిగించాయని... ఈ నేపథ్యంలో ఆమెను పిలిపించుకుని క్లాస్ పీకారని సమాచారం. తీరు మార్చుకోవాలని, లేకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో రోజా ప్రవర్తించిన తీరు వల్ల ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి అవకాశాలు సన్నగిల్లాయంటూ గతంలోనే రోజాను జగన్ మందలించారట.

ఈ నేపథ్యంలో, కొంత కాలం మౌనంగా ఉన్న రోజా... ఇప్పుడు మళ్లీ మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడుతున్నారనే విషయం మళ్లీ జగన్ దృష్టికి వెళ్లిందట. పవిత్రమైన తిరుమల కొండపై కూడా రోజా రాజకీయ విమర్శలకు దిగుతుండటం... జగన్ కు ఏ మాత్రం నచ్చడం లేదని వైసీపీ నేతలు కొందరు చెబుతున్నారు. తిరుమల వెంకన్న సన్నిధిలో రాజకీయాలు ఏంటంటూ ఈ మధ్యనే రోజాపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో, రోజాను ఇంటికి పిలిపించుకుని జగన్ మందలించారనే విషయంపై కూడా వైసీపీ నేతల మధ్య చర్చ జరుగుతోందట. నియెజకవర్గంలో రోజా ఉండటం లేదన్న ఫిర్యాదులు కూడా జగన్ కు కోపం తెప్పించాయట. సర్వే రిపోర్టులు కూడా రోజాకు వ్యతిరేకంగా రావడంతో రోజాకు జగన్ క్లాస్ పీకారట. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాల్సింది పోయి... ఇలా దూరంగా ఉండటం ఏమిటని జగన్ ప్రశ్నించారట. ఏది తోచితే అది మాట్లాడకుండా... పార్టీ సూచించిన విధంగా మాట్లాడాలంటూ రోజాకు జగన్ సూచించినట్టు సమాచారం.

వైసీపీ అధికారంలోకి వస్తే, తానే హోం మంత్రిని అంటూ రోజా ప్రచారం చేసుకుంటున్నారనే విషయంపై కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనిపై రోజాను ప్రశ్నించారట. ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే,  పరిస్థితి మరోలా ఉంటుందని జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

More Telugu News