: కోల్ కతా ప్రెసిడెన్సీ జైలులో జస్టిస్ కర్ణన్.. సాధారణ ఖైదీలానే చూస్తామన్న అధికారులు!

నాటకీయ పరిణామాల మధ్య కోయంబత్తూరులో అరెస్టయి, ఆపై సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి తిరస్కరణకు గురైన కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్, ప్రెసిడెన్సీ జైలులో తొలిరాత్రి గడిపారు. కర్ణన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన్ను కోల్ కతా తరలించగా, బెయిల్ పై సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేంత వరకూ వేచి చూసి, ఆపై దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. ఆయన్ను ప్రత్యేక ఖైదీగా చూడాలన్న ఎటువంటి ఆదేశాలూ లేకపోవడంతో సాధారణ ఖైదీలున్న బ్యారక్ లోకే తరలించినట్టు ఓ అధికారి తెలిపారు.

రాత్రి ఆయన చాలా సేపు నిద్రపోలేదని, ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదని జైలు వర్గాలు వెల్లడించాయి. కాగా, జైలుకు వెళ్లేముందు కర్ణన్ తనను చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడుతూ, తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ను నిరాకరించిన తరువాత, బీపీ ఎక్కువగా ఉందని కర్ణన్ చెప్పడంతో, ఆరోగ్య పరీక్షలు జరిపించిన పోలీసులు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని నిర్దారించుకున్న మీదట జైలుకు తరలించారు.

More Telugu News