: వర్ధమాన నటుడిపై ఫిర్యాదు చేసిన యువతి...కేసు నమోదు చేసిన పోలీసులు

వర్థమాన సినీనటుడు తనతో అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించాడంటూ విజయవాడకు చెందిన యువతి (21) హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... విజయవాడకు చెందిన యువతి (21) తన సోదరుడు నరేంద్రతో కలిసి వెంకటగిరిలో నివాసం ఉంటున్న కమెడియన్‌ డీవీనాయుడు ఇంటికి చుట్టరికానికి వచ్చింది. అయితే తన బావ డీవీ నాయుడు నివాసంలో ఉండగా, రాము అనే వర్థమాన నటుడు వచ్చాడని, కులం పేరుతో దూషిస్తూ, తన తమ్ముడితో పాటు తనపై దాడి చేసి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో తెలిపింది.

కాగా, డీవీ నాయుడుతో రాముకి రియల్ ఎస్టేట్ విభేదాలు ఉన్నాయి. రాముకి 9.5 లక్షల రూపాయలు అప్పుగా డీవీ నాయుడు ఇచ్చాడు. ఇవి చెల్లించకపోవడంతో కృష్ణానగర్‌ లోని రాము నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన డీవీ నాయుడు రాముని డబ్బుల విషయంలో నిలదీశాడు. అంతే కాకుండా అతని ఇంటి ఓనర్ కు కూడా ఈ అప్పు విషయం చెప్పాడు. దీంతో అతనిపై కక్షపెంచుకున్న రాము... తన స్నేహితులతో కలిసి డీవీ నాయుడు ఇంటిపై దాడి చేసి, అతని మరదలు, బావమరిదిపై దాడి చేశాడని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

More Telugu News