: శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు: బ్యూటీషియన్ శిరీష బాబాయ్ ఆరోపణ

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా, బెంగళూరులో నివసించే శిరీష బాబాయ్ శ్రీనివాసరావు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ సరిగా జరగలేదని, శిరీషను హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఆ రోజున శిరీష తన భర్తకు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసిన సమయం 1.58 గంటలుగా పోలీస్ కమిషనర్ పేర్కొన్నారని, అది కరెక్టు కాదని అన్నారు. ఆ లొకేషన్ ను పరిశీలిస్తే పోలీస్ క్వార్టర్స్ ను కాకుండా, అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని లొకేషన్ ను చూపిస్తోందని ఆయన అన్నారు.

శిరీష పోలీస్ క్వార్టర్స్ కు వెళ్లలేదని, ఓ రిసార్ట్స్ లో వీళ్లందరూ కలుసుకున్నారని, శిరీష తలపై గాయం ఆమెను జుట్టు పట్టుకుని లాగితే అయింది కాదని, బలంగా తలపై కొట్టడం వల్లే ఆ గాయం అయిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శిరీష వారి నుంచి తప్పించుకునే క్రమంలో కారు దిగి పారిపోయిందని, ఈ క్రమంలో తన లొకేషన్ ను భర్తకు షేర్ చేసిందని అన్నారు. పారిపోయిన శిరీషను పట్టుకుని బలంగా కొట్టి చంపారని, రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కలిసి ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, చాలా ధైర్యవంతురాలని చెప్పారు. ఈ నెల 7న శిరీష పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో చివరిసారిగా మాట్లాడానని శ్రీనివాస రావు చెప్పారు.

More Telugu News