: నా భర్తకు చంద్రబాబుతో ఎలాంటి సంబంధాలు లేవు!: వైసీపీ ఎంపీ బుట్టా రేణుక

ఒకానొక సమయంలో కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు బుట్టా రేణుక, ఆమె భర్త ఆయనను కలిశారు కూడా. అయితే, ఊహించని విధంగా ఆమె వైసీపీలోనే ఉండిపోయారు. దీనిపై ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ, అది అనుకోకుండా జరిగిపోయిందని తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు తన భర్త కూడా అప్పట్లో చంద్రబాబు నివాసానికి వెళ్లారని... ఆ సమయంలో ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారని చెప్పారు. ఆ క్షణంలో అలా జరిగిపోయిందని... తన భర్త ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదని అన్నారు.

తాను మాత్రం చంద్రబాబు ఇంటికి వెళ్లలేదని... ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తన భర్తకు చంద్రబాబుతో ఎలాంటి సంబంధం లేదని... ఆయన టీడీపీలో చేరే అవకాశం కూడా లేదని చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలుపొందినప్పుడు... ఆ పార్టీలోనే కొనసాగాలనేది తన అభిప్రాయమని రేణుక తెలిపారు. పార్టీ ఫిరాయించి, ఇతర పార్టీలోకి జంప్ కావడానికి తాను వ్యతిరేకమని చెప్పారు.

More Telugu News