: డబ్బు తీసుకుంటాం, ఆడతాం.. క్రికెటర్లుగా మేము దేశానికి చేసేదేమీ లేదు: బంగ్లా కెప్టెన్ మోర్తజా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మోర్తజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రికెటర్లుగా తాము దేశానికి చేసేదేమీ లేదని... తమను హీరోలుగా, స్టార్లుగా కీర్తించవద్దని మోర్తజా కోరాడు. డబ్బులు ఇస్తేనే తాము క్రికెట్ ఆడుతామని... ఈ నేపథ్యంలో క్రికెట్ కు, దేశ భక్తికి ముడిపెట్టవద్దని చెప్పాడు. ఏ దేశంలోనైనా నిజమైన హీరోలు రైతులేనని తెలిపాడు. పొలంలో పంటలు పండించే రైతులు, దేశ గోడలను నిర్మించే శ్రామికులు, ప్రాణాలను కాపాడే డాక్టర్లే నిజమైన హీరోలని చెప్పాడు.

క్రికెటర్లుగా తాము చేస్తున్నది ఏమీ లేదని... కనీసం ఒక ఇటుకను కూడా తయారు చేయలేమని మోర్తాజా అన్నాడు. శ్రామికులైతే దేశాన్నే నిర్మిస్తారని కితాబిచ్చాడు. నిజం చెప్పాలంటే, ఒక యాక్టర్, ఒక సింగర్ ఏం చేస్తారో... తాము కూడా అదే చేస్తున్నామని అన్నాడు. డబ్బు తీసుకుని, క్రికెట్ ఆడతామని చెప్పాడు. దేశ భక్తి గురించి మాట్లాడేవారంతా, దేశం కోసం ఆలోచించాలని సూచించాడు. రోడ్ల మీద చెత్త వేయడం, వీధుల్లో ఉమ్మి వేయడం, ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వంటివి అందరూ మానుకోవాలని, అప్పుడే దేశం కొంచెం మారుతుందని చెప్పాడు. దేశం కోసం నిజాయతీగా పని చేయడమే, నిజమైన దేశభక్తి అని తెలిపాడు. క్రికెట్ తో ముడిపడిన దేశభక్తి ఏమిటో తనకు ఇంతవరకు అర్థం కాలేదని అన్నాడు. 

More Telugu News