: అసభ్యంగా తాకుతున్న కండక్టర్ చెంప ఛెళ్లుమనిపించిన యువతి ధైర్యం!

తాను ప్రయాణిస్తున్న బస్సులో రద్దీ ఎక్కువగా ఉన్న వేళ, ప్యాసింజర్లను సర్దే క్రమంలో అసభ్యంగా తాకుతున్న కండక్టర్ చెంపను ఛెళ్లుమనిపించిందో యువతి. అంతేనా, ఆ ఘటనను ఫేస్ బుక్ లో పంచుకోగా, పోలీసులు స్పందించి, కేసు నమోదు చేసిన ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ నెల 18న కటక్ లో పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్ కు బయలుదేరిన యువతికి ఖాళీగా ఉన్న బస్సు తారసపడలేదు. దీంతో రద్దీగా ఉన్న బస్సును ఆమె ఎక్కింది. బస్సు కిటకిటలాడుతుండగా, మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని కండక్టర్ అభ్యంతరకరంగా తాకుతున్నాడని గుర్తించింది. తనకూ అదే పరిస్థితి రావడంతో, ధైర్యంగా స్పందించింది. జరిగిన ఘటనను సోమవారం నాడు తన ఫేస్ బుక్ ఖాతాలో బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి ఘటనలపైనా ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి కావడంతో, కటక్, భువనేశ్వర్ నగరాల కమిషనర్ వైబీ ఖురానియా ఆదేశాలతో కేసు నమోదైంది.

More Telugu News