: సరిహద్దుల్లో మూడు సార్లు చేసిన యుద్ధం కంటే ఈ యుద్ధమే కష్టంగా ఉంది: రిటైర్డ్ సైనికుడి ఆవేదన

సరిహద్దుల్లో మూడుసార్లు దేశరక్షణ కోసం చేసిన పోరాటం కంటే....దేశంలోపల తాను చేస్తున్న పోరాటమే కష్టంగా అనిపిస్తోందని మాజీ సైనికుడు వాపోయిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంకు చెందిన మేడికొండ ఆదాం 1961–62 నుంచి 1975 వరకు భారత సైన్యంలో ఇన్‌ ఫాంట్రీ విభాగంలో సిపాయిగా విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలో ఆయన 1962లో చైనాతో, 1965, 1971 పాకిస్థాన్‌ తో జరిగిన యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. పదిహేనేళ్ల సర్వీసు ముగిసిన తరువాత విరమణ తీసుకున్నారు. ఈ సమయంలో సాగుచేసుకునేందుకు భూమి కావాలని అర్జీ పెట్టుకోవడంతో ప్రభుత్వం పట్టించుకోలేదు.

 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిసి జీవనోపాధికి భూమి కేటాయించాలని కోరడంతో ఆయన ఆదేశాలమేరకు అధికారులు వెల్లటూరు పరిసరాల్లోని సర్వేనెంబర్‌ 454/13–బి 19లో 2.50 ఎకరాలు, బి– 21లో 2 ఎకరాలు కలిపి 4.50 ఎకరాలు సర్వేచేసి హద్దులు చూపారు. అయితే, ఇప్పుడు దానిని సాగుచేయడం లేదన్న కారణంతో ఆ భూమి రికార్డులను మార్చి ఆక్రమించుకునేందుకు కొందరు పావులు కదుపుతున్నారని, దీనిపై నాలుగేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడంతో లేదని ఆయన వాపోయాడు. సరిహద్దుల్లో పోరాటం కంటే ఈ భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటమే చాలా కష్టంగా ఉందని ఆయన నిట్టూరుస్తున్నాడు. 

More Telugu News