: మూడు పెళ్లిళ్లు... అక్రమ సంబంధాలు... పర్యవసానం మహిళ ఆత్మహత్యాయత్నం!

మూడు పెళ్లిళ్లు చేసుకుని, రెండు అక్రమ సంబంధాలు నెరుపుతున్న ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాత గుంటూరు మణి హోటల్‌ ప్రాంతంలో నివసించే దేవదాస్‌ దంపతుల కుమార్తె మహిత (27) కు 12 ఏళ్ల క్రితం శేఖర్‌ అనే యువకుడితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే రెండేళ్ల తరువాత శేఖర్ ను వదిలేసిన మహిత అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని వివాహం చేసుకుంది. మరో రెండేళ్లకు అతన్ని వదిలేసి కొరిటెపాడుకు చెందిన శ్రీమన్నారాయణ అనే వివాహితుడిని మూడో వివాహం చేసుకుంది.

ఆ తరువాత అతనితో ఉంటూనే మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడంతో అతను ఆమెను వదిలేశాడు. ఏడాది క్రితం ఆ ఇద్దరు యువకులు కూడా ఆమెను వదిలించుకున్నారు. దీంతో శ్రీమన్నారాయణ వద్దకు వెళ్లిన మహిత డబ్బులివ్వాలని కోరింది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో తామిద్దరం కలిసి ఉన్న ఫోటోలు అందరికీ చూపిస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో ఆయన పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించాడంతో, వారు ఆమెను పిలిచి మందలించి పంపేశారు.

దీంతో వేదనకు గురైన ఆమె... 'మీ అందరి అంతు చూస్తా'నని బెదిరింపులకు దిగి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు రోడ్డులో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక చేతిలో పురుగు మందు, మరో చేతిలో కూల్‌ డ్రింక్‌ సీసా పట్టుకుని కూర్చుంది. దీనిని గమనించిన స్థానికులు 108 కు ఫోన్ చేశారు. అంతలో ఆమె మళ్లీ పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెకు 108 సిబ్బంది ప్రాధమిక చికిత్స చేసి, గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

More Telugu News