: షాకింగ్ కుంభకోణం... 40 లక్షలకు అమ్మదనాన్ని అమ్మేస్తున్న సాయికిరణ్ ఆసుపత్రి... 37 లక్షలు లాభం!

హైదరాబాదులో షాకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. బంజరాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో కేన్సర్ ఆసుపత్రికి దగ్గర్లో గల సాయికిరణ్ ఆసుపత్రి అమ్మదనాన్ని అమ్మకానికి పెట్టింది. ఇలా కొన్నేళ్లుగా చేస్తూ భారీ ఎత్తున డబ్బులు మూటగట్టుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... సాయికిరణ్ ఆసుపత్రి భారీ ఎత్తున చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సమాచారంతో జూబ్లిహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు సదరు ఆసుపత్రిపై దాడులు నిర్వహించారు. ఈ సమయంలో ఆసుపత్రిలో 3 వారాల నుంచి 8 నెలల గర్భం దాల్చిన 48 మంది మహిళలు ఆసుపత్రిలో ఉన్నారు. వారిని ఆరాతీసి, రికార్డులు పరిశీలించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆ 48 మంది మహిళలు అమ్మదనాన్ని అమ్ముకున్నారు. సరోగసీ విధానంపై సరైన విధానం లేకపోవడంతో సాయికిరణ్ ఆసుపత్రి ప్రతి ఏటా 50 మంది మహిళలతో పిల్లల్ని కనేలా చేసి, వారిని అమ్ముకునేవారు.

 ఇలా చేసేందుకు పిల్లల తల్లిదండ్రుల నుంచి 40 నుంచి 50 లక్షల మధ్యలో వసూలు చేసేవారని తేలింది. అమ్మతనాన్ని మోసిన వారికి కేవలం రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు. ఆసుపత్రిలో ఉన్నన్ని నాళ్లు వారి వైద్య, భోజన ఖర్చులన్నీ చూసుకునేవారు. ఈ లెక్కన ఒక వ్యక్తి నుంచి సుమారు 37 లక్షల రూపాయల లాభాన్ని ఈ ఆసుపత్రి వెనకేసుకుంది. అంటే ఏటా సరోగసీ విధానంలో పిల్లల్ని కనేందుకు 45 మందిని ఒప్పిస్తే ఆసుపత్రి పొందే లాభం 16.65 కోట్ల రూపాయలంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. దీనిని గుర్తించిన అధికారులు ఆసుపత్రి ఫైల్స్ ను సీజ్ చేశారు. ఈ 48 కేసుల్లో చట్టప్రకారం ఉన్నవి కేవలం రెండే రెండు కేసులంటే ఆశ్చర్యకరమే. ఇందులో 13 మంది విదేశీయుల పిల్లలు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇలాంటి కేసుల్లో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని పోలీసు అధికారులు వైద్యఆరోగ్య శాఖాధికారులకు దీనిపై పూర్తి సమాచారం ఇచ్చారు.

More Telugu News