: పెను కలకలం... చెన్నైలోని జైల్లో పాకిస్థాన్ జెండా!

చెన్నైలోని ఓ జైల్లో పాకిస్థాన్ జెండా దొరకడం పెను కలకలం రేపుతోంది. సాధారణంగా కశ్మీర్ లోని అల్లర్లు జరిగే ప్రాంతాల్లో దర్శనమిచ్చే పాకిస్థాన్ జెండా... నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉండే చెన్నైలోని పుళల్‌ జైల్లోకి ఎలా వచ్చిందనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. పుళల్‌ జైల్లో జైలర్‌ జయరామన్‌, సిబ్బంది ప్రహరీ వద్ద గస్తీలో ఉన్న సమయంలో ఆక్కడ నలుపు రంగు స్టిక్కర్‌ అతికించిన అట్టపెట్టె కనిపించింది. దాంతో అందులో పేలుడు పదార్థాల వంటివి ఉన్నాయేమోనన్న అనుమానంతో దానిని జాగ్రత్తగా తెరిచారు.

అందులో వారికి పెద్ద పాకిస్తాన్‌ జాతీయ జెండా కనిపించింది. దీంతో దిగ్భ్రాంతికి గురై చూడగా, మరో 103 చిన్న జెండాలు, ఖరీదైన సెల్‌ ఫోన్‌ లు కూడా లభ్యమయ్యాయి. దీంతో ఆ ఫోన్ లోని ఈఎంఈఐ నెంబర్ ఆధారంగా అది ఎక్కడ?, ఎవరు కొన్నారు? జైలులో ఎవరికి ఇవ్వాలనుకున్నారు? వంటి విషయాలు ఆరాతీస్తున్నారు. ఎవరికో అందించాలన్న లక్ష్యంతోనే ఈ పెట్టెను జైల్లోకి విసిరి ఉంటారని, అది ప్రహరీ పక్కన పడిపోయి, జైలర్ కంటబడిందని భావిస్తున్నారు. 

More Telugu News